ఒక రోజు అక్బర్ చక్రవర్తి నిండు సభలో కొలువై ఉండగా, అందరినీ ఉద్దేశించి "నాకు కొన్ని సందేహాలు కలిగాయి అవి ఎనిమిది ప్రశ్నలుగా అడగదలిచాను, ఎవరైనా చెప్పగలరా?" అని అన్నారు.
అంతట ఆ సభలోని వారు రకరకాలుగా ఆలోచించసాగారు. అసలు చక్రవర్తి ఏమి అడుగుతారో, వాటికి సమాధానం చెప్పలేకపోతే అవమానపడవలసి వస్తుందని మౌనంగా ఉండిపోయారు.
అపుడు బీర్బల్ ఈ విధంగా ఆలోచించసాగాడు "చక్రవర్తి ఏమి అడుగుతారో తెలియదు అయినప్పటికీ ప్రయత్నం చేయకపోవడమే అసలైన ఓటమి కదా! అందుచేత ముందు ప్రశ్నలు తెలుసుకోవాలి ఒకవేళ సమాదానాలు తెలియకపోతే అపుడే తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు." అని అనుకుని లేచి నిలబడి చక్రవర్తికి వందనం చేసి "ప్రభూ, ఆ ప్రశ్నలేమిటో చెప్పండి నేను సమాధానాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను." అని అన్నాడు.
అపుడు చక్రవర్తి ఇలా అడగడం మొదలు పెట్టారు.
"దానం చేసిన కొద్దీ పెరిగే సంపద ఏమిటి?"
------- విద్య, జ్ఞానం. ఇవి ఎంత ఎక్కువ దానం చేస్తే అంత పెరుగుతూ ఉంటాయి.
"గడ్డి పరక కంటే తేలికైనది ఏమిటి?"
------- మనిషిలోని వక్ర బుద్ధి. దానికి ఇహ లోకంలో కానీ పర లోకం లో కానీ ఎలాంటి విలువ ఉండదు.
"లోకంలోనే అతి సున్నితమైనది, సూక్ష్మమైనది ఏమిటి?"
------- మంచి బుద్ధి, ఆలోచనలు కలిగిన మనిషి మనసు.
"గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏమిటి?"
------- మనిషి మనసు.
"నిద్రపోతూ కూడా కన్ను మూయనిది ఏమిటి?"
------- చేప.
"నీడలా ఎప్పుడు వెన్నంటి ఉండేది ఏమిటి?"
-------- మనిషి చేసే పాపపుణ్యాలు.
"కష్టపడిన కొద్దీ పెరిగేది ఏమిటి?"
-------- కీర్తి.
"ఏది ఎక్కువగా మనోవేదన కలిగించగలదు?"
-------- మనిషి రహస్యంగా చేసే పాప కర్మలు ఆ మనిషికి ఎక్కువ మనోవేదన కలిగిస్తాయి.
"ఆహా! బీర్బల్ నా ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు." అని అక్బర్ చక్రవర్తి బీర్బల్ కి చాలా బహుమతులు ఇచ్చి సత్కరించాడు.
No comments:
Post a Comment